Tuesday, March 4, 2014

కంభాలపల్లి చంద్ర‘శేఖర్’ గురించి కొన్ని ముచ్చట్లు!

శేఖర్ గురించి ముచ్చటించుకోవాలంటే చాలా చాలా రోజుల వెనక్కి వెళ్ళాలి, బహుశా సంవత్సరాల వెనక్కి! నిజం చెప్పాలంటే నాకు శేఖర్ అని సంభోదించడం కంటే, కంభాలపల్లి చంద్రశేఖర్ అనడమే ఇష్టం. ఎందుకంటే… 1989 – 91 మధ్య కాలంలో నేను జాగృతి వార పత్రికలో సబ్ ఎడిటర్ కమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నపుడు ఆదివారం, మయూరి వార పత్రికలలో కంభా పేరుతోనూ, కంభాలపల్లి పేరుతోనూ కార్టూన్లు విరివిగా వస్తుండేవి. తన పేరు పెట్టుకోకుండాఇలా షార్ట్ ఫామ్ లో కార్టూన్లు గీసే వ్యక్తి ఎవరా అనే డౌట్ వస్తుండేది. (బహుశా సమయంలో ఆయన ప్రముఖ దిన పత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తున్నందు వల్ల పేరుతో కార్టూన్లు గీశారేమో అని ఇప్పుడనిపిస్తోంది!) నేను అప్పటికే ఐదారేళ్ళ నుండి కార్టూన్లు గీస్తుండటం చేతతోటి వారి కార్టూన్లు చదివి ఆనందించడంతో పాటుఅవి ఎవరు గీశారా అని ప్రత్యేకంగా గమనిస్తూ ఉండేవాడిని. చిన్న పిట్ట బొమ్మ, పక్కనే కంభా అనే పేరు! ‘ఈయనెవరో చాలా సింపుల్ లైన్ తో భలే గీసేస్తున్నాడు కార్టూన్లుఅని అనుకునేవాడిని. అలా నాకు తెలియకుండానే ఆయన అభిమానిగా మారిపోయాను. విధంగా కంభాలపల్లి చంద్రశేఖర్ తో పరోక్షంగానూ, ఆయన కార్టూన్లతో ప్రత్యక్షంగానూ సంబంధం ఏర్పడింది. తర్వాత జాగృతి కార్యాలయానికి ఓసారి కంభాలపల్లి చంద్రశేఖర్ రావడంఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవడం జరిగింది. అయితేశేఖర్ ఆంధ్రపభ దిన పత్రికలో కార్టూనిస్టుగా చేరిన తర్వాత నాకు బాగా సన్నిహితులయ్యారు.  ఇతర మిత్రులను కలవడానికి ఆంధ్రప్రభ ఆఫీస్ కు వెళ్ళినప్పుడల్లా పని కట్టుకుని శేఖర్ ను కలిసి, కాసేపు ముచ్చటించి వస్తుండేవాడిని.
2002లో ఆంధ్రజ్యోతి పునః ప్రారంభమైనప్పుడు, నేను వార్త దినపత్రిక నుండి, ఆయన ఆంధ్రప్రభ నుండి జ్యోతి డైలీకి వచ్చాం. దాదాపు ఆరు సంవత్సరాలు ఇద్దరం కలిసే పనిచేశాం. కార్టూన్లు గీయడం నా ప్రవృత్తి అయిన కారణంగాశేఖర్ గీసే కార్టూన్లను, ప్రత్యేకించి ఆయన అంకితభావాన్ని ఆరాధిస్తూ ఉండేవాడిని. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో శేఖర్ గీసినలైఫ్ లైన్కార్టూన్లు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఒకే కార్టూన్ లో వ్యక్తికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని శేఖర్ చాలా చక్కగా, ఆకర్షణీయంగా అందించేవారు.
కార్టూనిస్టుగా ఆయన అమెరికా పర్యటించి రావడం గర్వంగా అనిపించింది. అలానే మా గురువుగారు, జాగృతి సంపాదకులు శ్రీ రామమోహనరావు గారి స్మారక పురస్కారాన్ని శేఖర్ కు ఇవ్వబోతున్నారని తెలిసి ఎంతో సంతోషించానుశేఖర్ కు ఫోన్ చేసి అభినందించినప్పుడు, ‘ అవార్డుకు ఎంపిక కావడం తనకూ ఆనందంగా ఉందని చెప్పారు. అయితే చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా పురస్కారాన్ని ఆయన స్వయంగా అందుకోలేక పోయారు. విశేషం ఏమంటే విజయవాడ నుండి కార్యక్రమ నిర్వాహకులు హైదరాబాద్ లోని శేఖర్ ఇంటికి వచ్చి, ఆయనకు అవార్డును అందించి, సత్కరించారు. కార్టూనిస్టుగా శేఖర్ గొప్పతనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేముంది! పుష్కరకాలంగా ప్రతిరోజూ ఆంధ్రజ్యోతిలో శేఖర్ కార్టూన్ చూడటం వ్యసనంగా మారిపోయింది. మధ్య వరుసగా రెండు రోజులు శేఖర్ కార్టూన్ రాకపోయేసరికి గుండె గొంతుకలోకి వచ్చేసింది. ‘ఏమైందోఏమిటో?’ అని కంగారుగా మిత్రుడు అన్వర్ కు ఫోన్ చేశాను. అతని సలహాతో శేఖర్ శ్రీమతితోనూ మాట్లాడాను. ఆరోగ్యం బాగోక హాస్పటల్ లో అడ్మిట్ అయ్యారని తెలిసింది. మర్నాడుసాక్షిశంకర్ ఫోన్ చేసి, ‘ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడింది. ఇప్పుడే మేం శేఖర్ ను చూసి వస్తున్నాంఅని చెప్పిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాను. ఆపైన మరో రెండు, మూడు రోజులకు తిరిగి ఆంధ్రజ్యోతిలోని రెండో పేజీలో శేఖర్లోకం తీరుప్రత్యక్షం కావడంతో దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. శేఖర్ నిర్విరామంగా, నిరాటంకంగా మరిన్ని సంవత్సరాలు తన కార్టూన్లతో పాఠకులను అలరించాలని కోరుకుంటున్నాను, అలరిస్తాడని విశ్వసిస్తున్నాను!
                                                                              -      ఓంప్రకాశ్ నారాయణ వడ్డి (ఓనావ)

No comments:

Post a Comment